త్రిపుర వెంచర్లో విషాదం: డబ్బు ఇవ్వమంటే చావమన్నాడు
యువకుడు మృతి
ఇది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ హత్యే
బాధితుడి కుటుంబ సభ్యుల ఆవేదన
నార్సింగి /చేగుంట,(విజయక్రాంతి): తాను చేసిన పనులకు త్రిపురా వెంచర్ వారు డబ్బులు చెల్లించక పోవడం తో అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురైన వ్యక్తి అదే వెంచర్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్సింగి మండలంలో సోమవారం చోటు చేసుకుంది. రామాయంపేట సీఐ వెంకట రాజు గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మసాయిపేట్ మండలం చెట్ల తిమ్మాయి పల్లి,నడిమి తాండా కు చెందిన లకావత్ రాజు (33) భార్య లలిత, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తూ స్వంత ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
సంవత్సరం నర కాలం క్రితం నార్సింగి మండలం భీం రావు పల్లి పరిధి లోని త్రిపురా వెంచర్ లో ట్రాక్టర్ తో పనులు చేసినప్పటికీ అప్పటి నుంచి రావాల్సిన బకాయి డబ్బులు చెల్లించకుండా, వేధింపులకు గురి చేస్తుండడంతో,ట్రాక్టర్ ఫైనాన్స్ చెల్లించ లేక పోయాడు. సోమవారం ఉదయం ఫైనాన్సర్లు డబ్బుల కోసం ఇంటికి రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజు,వెంచర్ వద్దకు వెళ్లి డబ్బులు అడిగినా చెల్లించకపోవడం తో అక్కడి కాటేజ్ లో తాడు తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సీఐ తో పాటు నార్సింగి ఎస్ఐ బీమరి సృజన, చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించగా, బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
కొసమెరుపు : రాజు ఆత్మహత్య చేసుకోలేదని అతనిని వెంచర్ వారే హత్య చేశారని గాయాలను చూస్తే అర్ధం అవుతుందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా త్రిపురా వెంచర్ వారు పనులు చేయించుకుని సంవత్సరాల తరబడి చెల్లింపులు చేయకుండా పలువురిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల వల్ల ఇంకా ఎన్ని కుటుంబాలు నష్ట పోతాయోనని అక్కడ చేరిన ప్రజలు చర్చించుకోవడం కనబడింది.






