18-02-2026 12:45:53 AM
15 సంవత్సరాలలో 28 వేల మందికి శస్త్ర చికిత్సలు
ఏజెన్సీ ప్రాంతానికి వరం
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో ఇబ్బంది పడవద్దని అమోఘమైన ఆలోచనతో ఏర్పాటుచేసిన ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ నిరుపేదలకు వరంగా మారింది. నూటికి నూరు శాతం ఏజెన్సీ జిల్లాగా పేరు అందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏర్పాటు చేసిన ఎల్ వి ప్రసాద్ ఆసుపత్రి పేదలకు కంటి వెలుగునిస్తోంది. నవ లిమిటెడ్ సహకారంతో 2011లో ఏర్పాటు చేసిన ఈ కంటి వైద్యశాల 15 ఏళ్లుగా 28 వేల మందికి ఉచిత కంటి శస్త్ర.చికిత్సలు అందించి చూపును ప్రసాదించారు. అనునిత్యం జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లా నుంచి సైతం సుమారు 200 మంది కంటి పరీక్షల కోసం వైద్యశాలకు వస్తుంటారు.
ఆర్థిక స్తోమత లేని నిరుపేదలకు ఏ కానా తీసుకోకుండా వైద్య పరీక్షతో పాటు, శస్త్ర చికిత్సలు అందిస్తుంటారు. ఆసుపత్రిలో ఆధునాతన వైద్య పరికరాలు ఏర్పాటు చేసి మెరుగైన కంటి వైద్యాన్ని అందిస్తున్నారు. హైదరాబాదు వంటి నగరాలతో సమానంగా కంటి వైద్యం అందించటం గమనార్హం. సంపన్నుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఈ ఆసుపత్రిలో కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆస్పత్రికి అనుసంధానంగా మారుమూల గ్రామాల్లోనూ 10 సబ్ సెంటర్లను ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
5.40 లక్షల మందికి కంటి పరీక్షలు
2011 ఫిబ్రవరిలో ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ద్వారా 5.40 లక్షల మందికి కంటి పరీక్షల నిర్వహించారు. 56 వేల మందికి పైగా శస్త్ర చికిత్సలు నిర్వహించారు. వారిలో 27,728 మందికి పైగా ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
నిరుపేదలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం
కంటి చూపు తగ్గి రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్యం అందించడమే లక్ష్యం గా ఎల్.వి.ప్రసాద్ ఆసుపత్రి పనిచేస్తుంలది. నిరుపేదలతో పాటు ఇతరులకు తక్కువ ఖర్చుతో మెరుగైన కంటి వైద్యం అందిస్తాం.
-దేవి చందర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్