7 April, 2026 | 5:20 AM

వర్షార్పణం

07-04-2026 12:08 AM

ఈడెన్‌లో వరుణుడి ఆట

కోల్‌కతా, పంజాబ్ మ్యాచ్ రద్దు

కోల్‌కతా, ఏప్రిల్ 6 : ఐపీఎల్ 19వ సీజన్‌కు వర్షం దెబ్బ మొదలైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ , పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. టాస్ గెలిచిన కోల్ కతా బ్యాటింగ్ కూడా మొదలుపెట్టింది.  కోల్‌కతా ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయింది. ఫిన్ అలెన్ (6), కామెరూన్ గ్రీన్ (4) పరుగులకే వెనుదిరిగారు.

గ్రీన్ విఫలమవడం ఇది వరుసగా మూడోసారి. అయితే రహానే, రఘువంశీ ఇన్నింగ్స్ కొనసాగిస్తుండగా 3.4 ఓవర్లలో 25/2 స్కోరు దగ్గర వర్షం మొదలైంది.  ఎంతసేపటికీ తగ్గని వర్షం రెండు గంటల పాటు ప్రతాపం చూపించింది. రాత్రి పదిన్నర తర్వాత వర్షం తగ్గముఖం పట్టింది. అయితే మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని తేల్చారు. ఇదే విషయాన్ని ఇరు జట్ల కెప్టెన్లకు చెప్పి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు.