30 July, 2026 | 11:56 AM

ఖమ్మంలో బీఆర్ఎస్ గద్దే కూల్చివేత

30-07-2026 11:40 AM
  1. ఆగ్రహించిన బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు
  2. కాంగ్రెస్ అహంకార గద్దె కూలడం ఖాయం
  3. పువ్వాడకు వస్తున్న ప్రజాదరణ తట్టుకోలేక కాంగ్రెస్ కుట్రలు 
  4. విలేకర్ల సమావేశంలో ఖమ్మం బీఆర్ఎస్ నేతలు
  5. ఖమ్మంలో కూల్చివేతలే మంత్రి తుమ్మల ఎజెండా

ఖమ్మం, (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌ జెండా గద్దెల జోలికొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, ఆ అహంకార గద్దె కూలడం ఖాయమని ఖమ్మం బీఆర్ఎస్ నేతలు అన్నారు. ఖమ్మం నగరంలోని 8వ డివిజన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోద్బలంతో బీఆర్‌ఎస్‌ జెండా గద్దెను కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలించి నిరసన తెలిపారు. 

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Former Minister Puvvada Ajay Kumar)కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రి తుమ్మల అనుయాయులు కుట్రలు పన్నుతున్నారని సామాన్య ప్రజానీకంలో పువ్వాడపై ఉన్న చెక్కుచెదరని అభిమానాన్ని చూసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసహనానికి గురవుతున్నారని, అందుకే ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. 

సీఎం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్‌ జెండా గద్దెలను కూల్చేయాలంటూ చేసిన వ్యాఖ్యలను మంత్రి తుమ్మల(Minister Tummala Nageswara Rao) అనుసరిస్తూ బీఆర్‌ఎస్‌ జెండా గద్దెను కూల్చివేశారని, మాజీ మంత్రి పువ్వాడ పై రాజకీయ కక్షతో ఇటువంటి చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఖమ్మంలో కూల్చివేతలు చేయడమే మంత్రి తుమ్మల ఎజెండాగా పెట్టుకున్నారని ఆరోపించారు.  బీఆర్‌ఎస్‌ అనేది జెండా గద్దెలు కూల్చితే అంతమైపోయే పార్టీ కాదని, పువ్వాడ పై అభిమానం పార్టీపై విశ్వాసం ఖమ్మం ప్రజల గుండెల్లో ఉందని స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలతో పువ్వాడ నాయకత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలని భావించడం కాంగ్రెస్ నాయకుల రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు.

ఖమ్మం నగరంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దురాగతాలను ఎదుర్కొని ముందుకు సాగుతామని ప్రజల తీర్పే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతుందని, అధికార మదంతో వ్యవహరిస్తున్న నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బచ్చు విజయ్ కుమార్, పగడాల నాగరాజు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బత్తుల మురళి, కూరాకుల వలరాజు, నాగండ్ల కోటేశ్వరరావు, దేవభక్తుని కిశోర్ బాబు, గొల్లపూడి రాంప్రసాద్, సురేశ్ నాయక్, వీరేందర్ గౌడ్ , మాటేటి కిరణ్, వేగినాటి మధు, భూక్యా ఆశోక్ తదితరులు పాల్గొన్నారు.