08-02-2026 03:38:01 PM
సనత్నగర్,(విజయక్రాంతి): పిల్లలలకు విద్యతో పాటు క్రీడలు, కరాటే పోటీలలో తల్లిదండ్రులు ప్రోత్సహించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం బేగంపేటలోని పాటిగడ్డలో ఏర్పాటు చేసిన కుంగ్ పూ, మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిన విద్యార్థుల ప్రదర్శనను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరాటే, మార్షల్ ఆర్ట్స్ ఆత్మ రక్షణకు దోహదపడతాయని, మానసికంగా దృఢంగా ఉండేలా చేస్తాయని చెప్పారు.
4 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు చేసిన ప్రదర్శనలను ఆయన అభినందించారు. ఈ పిల్లలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని అవార్డ్ లను సాధించే విధంగా తీర్చిదిద్దాలని, అందుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని ప్రకటించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్ లు, అవార్డ్ లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ టి.మహేశ్వరి, నిర్వాహకులు చందు, కళ్యాణ్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, నరేందర్, శేఖర్, ఆరీఫ్, అఖిల్ తదితరులు ఉన్నారు.