27 March, 2026 | 11:20 AM

తిప్పిరి తిరుపతేనా అభయ్?

22-10-2025 02:17 AM

జాతీయ మీడియాలో విస్తృతంగా కథనాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నతో సహా వందలాది మంది సభ్యులు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ పోలీసుల లొంగిపోయిన వేళ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయంటూ జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. ఏప్రిల్‌లో పార్టీ సుప్రీం కమాండర్, జాతీయ కార్యదర్శి బసవరాజు అలియాస్ నంబాళ కేశవరావు ఎన్‌కౌంటర్ అనంతరం పార్టీ సుప్రీం కమాండర్ బాధ్యతలు చేపట్టిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్నారని ఆ కథనాల సారాంశం.

పార్టీలో ఆయనే ‘అభయ్’ పేరిట లేఖలు విడుదల చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతకముందు ‘అభయ్’ పేరిట మల్లోజుల వేణుగోపాల్ లేఖలు విడుదల చేసేవారని, ఇప్పుడు అదే పేరును తిరుపతి వినియోగిస్తున్నారని రాసుకొచ్చాయి. వేణుగోపాల్ లొంగిపోయిన తర్వాత ఇప్పటి వరకు అభయ్ పేరిట రెండు ప్రకటనలు విడుదలయ్యా యి. వాటిలో ఒకటి మల్లోజులతో సహా లొంగిపోయిన సభ్యుల చర్యను ఖండిస్తూ, మరొకటి ఈనెల ౨౪న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తూ మరో ప్రకటన విడుదలైంది.