అటవీ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయాలి
- అటవీ సంరక్షణపై ప్రజలు చైతన్య వంతులు కావాలి,
- ఈ ప్రాంతాన్ని పెద్ద పులుల మార్గంగా తీర్చిదిద్దుతాం
- జిల్లా అటవీ అధికారి జి. కిష్టాగౌడ్
- ఘనంగా అంతర్జాతీయ పెద్ద పులుల దినోత్సవం
భూపాలపల్లి, జులై 29 (విజయక్రాంతి): అటవీ, పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయాలని అటవీ సంరక్షణపై ప్రజలు చైతన్య వంతులు కావాలని ఈ ప్రాంతాన్ని పెద్ద పులుల మార్గంగా తీర్చిదిద్దుతామని జిల్లా అటవీ అధికారి జి. కిష్టాగౌడ్ అన్నారు. అంతర్జాతీయ పెద్ద పులుల దినోత్సవాన్ని(International Tiger Day) పురస్కరించుకొని అటవీ శాఖ భూపాలపల్లి ఆధ్వర్యంలో, పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక వరంగల్, జన విజ్ఞాన వేదిక, భూపాలపల్లి ఎకో క్లబ్, హరిత స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పర్యావరణ ప్రేమికుల భాగస్వామ్యంతో జిల్లాలోని రేగొండ మండలం పాండవుల గుట్ట వద్ద అడవి నడకతో పాటు పెద్ద పులుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అటవీ అధికారి కిష్టాగౌడ్ హాజరై మాట్లాడుతూ, ఒకప్పుడు పెద్ద పులులకు నిలయంగా ఉన్న భూపాలపల్లి అడవులు నేడు వాటి ఆహారంగా ఉండే శాఖాహార జంతువుల వేట కారణంగా పెద్ద పులులు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పులుల సంరక్షణ కఠిన చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం, విస్తృత అవగాహన ద్వారా మాత్రమే సాధ్యమని తెలిపారు. భూపాలపల్లి అడవులు ప్రఖ్యాతి గాంచినవని, ఇక్కడ అటవీ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అటవీ సంరక్షణపై ప్రజలను చైతన్యపరుస్తూ, ఈ ప్రాంతాన్ని పెద్ద పులుల మార్గంగా తీర్చిదిద్దే ప్రతిపాదనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో విశ్రాంత అటవీ జిల్లా అధికారులు కాజీపేట పురుషోత్తం, జి. సారయ్య, సందీప్ రెడ్డి, అప్పలకొండయ్య తదితర అటవీ విభాగ అధికారులు, క్షేత్ర సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి టి. శ్రవణ్ కుమార్, జన విజ్ఞాన వేదిక భూపాలపల్లి ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజు,చెల్పూర్ పరిధి అధికారి చంద్రమౌళి, ఎకో క్లబ్ ప్రతినిధులు సాజిద్ అలీ, రహీం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.






