30 June, 2026 | 3:12 AM

కాకతీయ మ్యూజికల్ గార్డెన్ అభివృద్ధి పనుల పరిశీలన

30-06-2026 12:06 AM

భద్రకాళి బండ్ నిర్వహణ పనులపై ప్రత్యేక దృష్టి 

నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులకు ఆదేశం

హనుమకొండ, జూన్ 29 (విజయక్రాంతి): కాకతీయ మ్యూజికల్ గార్డెన్ను అన్ని విధాలుగా ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) వైస్ చైర్మన్, చాహత్ బాజ్పాయి అధికారులను ఆదేశించారు. సోమవారం కాకతీయ మ్యూజికల్ గార్డెన్లో కొనసాగుతున్న పునరుద్ధరణ, సుందరీకరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. 

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, సివిల్ పనులు దాదాపు పూర్తయ్యాయని, ఫౌంటెన్లు, సుందరీకరణ, ల్యాండ్స్కేపింగ్ తదితర తుది పనులు కూడా పూర్తి దశకు చేరుకున్నాయని వివరించారు. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి, గార్డెన్ను ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని కుడా వైస్ చైర్మన్ సూచించారు. అనంతరం భద్రకాళి బండ్లో కొనసాగుతున్న నిర్వహణ పనులను పరిశీలించిన చాహత్ బాజ్పాయి, పారిశుద్ధ్యం, గార్డెనింగ్, స్వీపింగ్, క్లీనింగ్ వంటి నిర్వహణ కార్యక్రమాలను నిరంతరం సమర్థవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.నిర్వహణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా నిరంతర పర్యవేక్షణతో పనులు కొనసాగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ పరిశీలనలో కుడా అధికారులు, సీపీవో అజయ్ రెడ్డి, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.