కథ కొత్తగా ఉంటే ప్రయోగాలు చేయొచ్చు
టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేశ్ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దామల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నారు. వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 1న థియేటర్లలో రిలీజ్ కానుందీ చిత్రం. ఈ సందర్భంగా నిర్మాత చెర్రీ విలేకరులతో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. “రితేష్ ఎప్పుడూ డిఫరెంట్ కథలతో వస్తాడు. మైత్రి మూవీ మేకర్స్ ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్యానర్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి గర్వకారణం.
ఆ బ్యానర్లో ప్రొడక్షన్ చూసుకోవడం గర్వంగా ఉంది. నాకు చిన్న సినిమాలు, ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేయాలనే ఆసక్తి ఉంటుంది. ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్క్ తక్కువగా ఉండే కథలను ఎంచుకుంటూ ‘మత్తు వదలరా’, ‘హ్యాపీ బర్త్డే’, ‘మీటర్’, ‘జెట్లీ’ సినిమాలు చేశాం. ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో ముందుగా ఎవరూ చెప్పలేరు. కానీ మనం కథ ఎంచుకునేటప్పుడు కొత్తదనం ఉండేలా చూసుకోవచ్చు. కథ కొత్తగా వుంటే రిస్క్ తీసుకోవచ్చు. కొత్తగా.. రితేశ్తో ఒక హారర్ సినిమా చేయబోతున్నా. ఆ తర్వాత ‘మత్తు వదలరా 3’ ఉంటుంది. మరో ముగ్గురు దర్శకులు కథలు చెప్పారు, వాటికి కొంచెం సమయం పడుతుంది” అని చెప్పారు.






