నేను లేకపోతే ఊచలు లెక్క పెట్టేవాడివి !
- నీ దేశ ప్రజలే నిన్ను అసహ్యించుకుంటున్నారు
- నేను నిన్ను కాపాడుకుంటూ వస్తున్నా
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ట్రంప్ ఫైర్
- అంతర్జాతీయ మీడియాలో విస్తృతంగా కథనాలు
వాషింగ్టన్/ టెల్ అవీవ్, జూన్ ౨: ‘నేను లేకపోతే ఇప్పటికే నువ్వు ఊచలు లెక్కపెట్టేవాడివి. నువ్వొక పిచ్చోడివి. నేను నిన్ను కాపాడుకుంటూ వస్తున్నా. నిన్ను నీ దేశ ప్రజలే అసహ్యించుకుంటున్నారు. నువ్వసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవతుం దా?’ అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై తాజాగా అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర పదజాలంతో మందలించినట్లు అంతర్జాతీయ మీడియా లో కథనాలు ప్రసారమవుతున్నాయి.
ఇరు దేశాధినేతలు ఫోన్ సంభాషణలో ఈ పరిణామం చోటుచేసుకుందని శ్వేత సౌధ వర్గా లు చర్చించుకుంటున్నాయి. లెబనాన్లోని హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ సైనిక చర్యలపైనే ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేశారని, తక్షణం దాడు లు ఆపివేయాలని కూడా సూచించారనేది కథనాల సారాంశం. హెజ్బొల్లా కమాండర్ను హతమార్చేందుకు లెబనీస్ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇజ్రాయెల్ సైనిక చర్యల కారణంగా ఇరాన్తో దౌత్య ప్రయత్నాలను దెబ్బతింటున్నాయని ఆగ్రహం వ్య క్తం చేశారని సమాచారం.
ట్రంప్ మందలింపుతో నెతన్యాహు వెంటనే వెనక్కి తగ్గారని, లెబనాన్పై దాడులు నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇజ్రాయెల్లో వచ్చే అక్టోబర్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో నెతన్యాహుపై దేశ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు అధికార పార్టీపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. జాతీయ భద్రత విషయంలో అమెరికాకు నెతన్యాహు లొంగిపోయారని ఆరోపిస్తున్నాయి. తమ దేశాన్ని అమెరికాకు బేస్క్యాంప్గా మార్చారని మం డిపడుతున్నాయి.






