పడవ బోల్తా.. 250మంది గల్లంతు!
జెనీవా, ఏప్రిల్ 15: అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. శరణార్థులతో వెళుతున్న ఓ పడవ బంగాళాఖాతంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 250 మంది గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (జెనీవా)ల నుంచి సంయుక్త ప్రకటన వెలువడింది.
ఈ పడవ దక్షిణ బంగ్లాదేశ్లోని టేక్నాఫ్ అనే ప్రాంతం నుంచి బయలుదేరి మలేషియా వెళుతుండగా బలమైన ఈదురుగాలులు, కెరటాల ఉధృతి కారణంగా మునిగిపోయింది. పరిమితికి మించి పడవలో ఎక్కడం వల్లే ప్రమాదానికి మరో కారణమై ఉండొచ్చన్నారు. 2017లో మయన్మార్ సైన్యం నుంచి తప్పించుకొని రోహింగ్యాలు బంగ్లాదేశ్ తరలివెళ్లారు. అక్కడ కాక్స్ బజార్ శరణార్థుల శిబిరాల్లో ఉన్నారు. ఇటీవల మౌలిక సదుపాయాలకు తీవ్ర కొరత ఏర్పడడంతో వీరంతా వలసవెళ్లేందుకు నిర్ణయించి పడవబోల్తాలో గల్లంతయ్యారు.






