సూడి గేదె ఏద సూదిపై అధికారుల విచారణ
బిజినేపల్లి: సూడి గేదెకు ఏద సూది ఇంజెక్షన్ ఘటనపై మండల పశు వైద్యాధికారి డా.జీవిత గురువారం బాధిత రైతు కుర్మయ్య ఇంటివద్ద విచారణ చేశారు. బుధవారం వెలుగులోకి వచ్చిన సూడి గేదె ఏద ఇంజెక్షన్ ఘటనలో ఆ గేదెకు ఏద ఇంజెక్షన్ ఇవ్వడం, అబార్షన్ కావడం, చికిత్స చేసిన ఉద్యోగి వివరాలు, చికిత్స చేసిన తీరు గురించి పలు అంశాలు బాధిత పాడి రైతును అడిగి తెలుసుకున్నారు.
వనపర్తి జిల్లాలో 1962 పథకంలో ఒప్పంద ఉద్యోగిగా పని చేసే రాము అనే వెటర్నరీ అసిస్టెంట్ సూడి గేదెకు ఏద సూది ఇంజెక్షన్ ఇచ్చిన మాట వాస్తవమేనని, రెండు రోజులకే అబార్షన్ కూడా అయిందని బాధిత రైతు వివరించాడు. తన గేదెలకు ప్రభుత్వ పశు వైద్యశాఖ అధికారుల ఆద్వర్యంలో టీకాలు, వ్యాక్సిన్ లు వేయించుకోవడంతో పాటు పలు సందర్భాల్లో రామునే ప్రయివేటుగా చికిత్స చేస్తూన్నాడన్నారు. వెటర్నరీ అసిస్టెంట్ రాము అబార్షన్ అయిన గేదెకు సొంతంగా తిరిగి వైద్యం చేయిస్తున్నాడని, అతని మీద పిర్యాదు చేయడం తనకు ఇష్టం లేదని బాధిత రైతు పేర్కొన్నాడు.






