పూరీ రథయాత్రలో అపశ్రుతి.. ఒకరు మృతి
ఒడిశా: పూరీలో ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్ర(Puri Jagannath Rath Yatra)లో అపశ్రుతి చోటుచేసుకుంది. గురువారం బడా దండాలో దైవిక రథాన్ని లాగే దృశ్యాన్ని వీక్షించేందుకు వేచి ఉన్న సమయంలో తొక్కిసలాట జరిగింది. ఒక భక్తుడకి ఊపిరాడకపోవడంతో స్పృహ కోల్పోయినట్లు సమాచారం. అతడిని వెంటనే పూరీ జిల్లా ప్రధాన ఆసుపత్రి (Puri District Headquarters Hospital)కి తరలించారు. దురదృష్టవశాత్తు, ఆసుపత్రికి చేరుకునేసరికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గాయపడిన వారికి అత్యవసర బృందాలు చికిత్స అందిస్తున్నాయి.
ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు, అత్యవసర సేవా బృందాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. అధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, దేవి సుభద్రల వార్షిక గుండిచా ఆలయ యాత్ర సందర్భంగా, వారి ఆ దివ్య ప్రయాణాన్ని వీక్షించడానికి వేలాది మంది భక్తులు గుమిగూడినప్పుడు ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. మరణించిన భక్తుని వివరాలు, ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా, భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, పూరీలో జరిగిన వార్షిక రథయాత్రకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.






