భారీ వర్షం... రైతులకు తీరని నష్టం
కుమ్మరిపల్లిలో నాలుగు ఎకరాల పంట నష్టం
ధర్మపురి,జూలై29(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. బుధవారం కురిసిన భారీ వర్షానికి వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి బస్టాండ్ సమీపంలో వర్షపు నీరు మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిందని స్థానికులు తెలిపారు. మండలంలో ఆయా చోట్ల పంట పొలాలు పూర్తిగా కొట్టుకుపోయాయి.జక్కుల సత్యనారాయణ అనే రైతు యొక్క నాలుగు ఎకరాల వరి పంట పూర్తిగా వరదలో కొట్టుకుపోవడంతో కన్నీటి పర్యాంతం అయ్యాడు.
ఎడ తెరిపి లేని వర్షానికి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా శాఖల అధికారులు సూచిస్తున్నారు.అదే విధంగా రాంనూర్ గ్రామంలోని పుదారి లచ్చయ్య ఇంట్లోకి వరద నీరు భారీగా చేరింది. ఇంటి పరిసరాలు నీటమునగడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ తిరుపతి, వార్డు సభ్యులు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబానికి సహాయం అందించారు.వెల్గటూర్ మండలంలోని ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.






