ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయాలి
వేతన సవరణ పిఆర్సి పెండింగ్ బకాయిల చెల్లించాలని డిమాండ్
మధిర,(విజయక్రాంతి): తెలంగాణలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల నిరసనలు శుక్రవారం మిన్నంటాయి. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్,సమ్మెలో భాగంగా తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆత్మహత్యాయత్నం చేసి, చికిత్స పొందుతూ మరణించారు. శంకర్ గౌడ్ మృతితో మధిర ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నేతలు ఆందోళన తీవ్రతరం చేశారు. ఆర్టీసీ డిపో నుంచి కార్మికులు జేఏసీ నేతలు భారీ ర్యాలీగా ఆర్వి కాంప్లెక్స్ చేరుకొని అఖిలపక్ష నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి,వేతన సవరణ పిఆర్సి పెండింగ్ బకాయిల చెల్లించాలన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రైవేట్ డ్రైవర్లను ప్రోత్సహిస్తుందని వక్తలు ఆరోపించారు.






