బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ హరిత
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని 15–18 సంవత్సరాల లోపు వయస్సు గల బాలికలు స్నేహా వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిత సూచించారు. శనివారం సమీకృత కలెక్టరేట్ భవనంలోని సమావేశ మందిరంలో మే 2 నుండి జూన్ 10 వరకు నిర్వహించనున్న స్నేహా వేసవి శిబిరాలపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మార్మాట్తో కలిసి కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 15–18 సంవత్సరాల లోపు బాలికల కోసం మండల స్థాయిలో ఈ శిబిరాలను మే 2 నుండి జూన్ 10 వరకు నిర్వహించాలని తెలిపారు. ఈ శిబిరాలలో విద్యా కొనసాగింపు, ఆరోగ్య సేవల సమన్వయం, భద్రతపై అవగాహన, జీవన నైపుణ్యాల అభివృద్ధి, బాల్య వివాహాల నివారణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
శిబిరాల్లో రోజువారీ కార్యక్రమాలుగా పరస్పర పరిచయం, బాల్య వివాహాల నిరోధం, ఆరోగ్య మేళాలు, అవగాహన కార్యక్రమాలు, వ్యక్తిగత అవసరాలు మరియు సవాళ్లపై చర్చలు, సురక్షిత గ్రామ ప్రణాళిక, సమాజంతో సంభాషణ, ఆర్థిక అవగాహన, శారీరక దారుఢ్యం, క్రీడలు, విద్యా–కెరీర్ మార్గదర్శనం, సైబర్ భద్రత, స్వతంత్రత సాధనలో బాలికల శక్తి వంటి అంశాలను చేర్చి బాలికల మనోధైర్యం పెంపొందేలా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి శిబిరాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.






