పేదల రక్తం పీల్చేస్తున్న గాయత్రి ఆసుపత్రిని సీజ్ చేయాలి.!
ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని గాయత్రి ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రభుత్వ టారిఫ్ రేట్లను ఉల్లంఘిస్తూ రోగుల నుంచి రక్తం పీల్చినట్లు అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం పెద్ద ముద్దునూర్ గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఐసీయూ, హాస్పిటల్ సర్వీసెస్, ఆక్సిజన్ తదితర పేర్లతో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆసుపత్రి పడకల అనుమతులు, ఫైర్ సేఫ్టీ, కాలుష్య నియంత్రణ పత్రాల్లోనూ నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయంలో వైద్యారోగ్య శాఖ అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి ఆసుపత్రిని సీజ్ చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు.






