పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలి
గంధమల్ల రిజర్వాయర్, అశ్వరావుపల్లి ప్రాజెక్టులను పూర్తిచేయాలని సీపీఎం డిమాండ్
ఆలేరు: జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్లో నిర్వహిస్తున్న ధర్నాకు ఆలేరు నుంచి సీపీఎం నాయకులు తరలివెళ్లారు. జిల్లాలో అనేక నీటి వనరులు ఉన్నప్పటికీ వాటిని అభివృద్ధి చేసి ప్రజలకు సాగునీరు అందించడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఆలేరు ప్రాంతానికి సాగునీరు అందించే గంధమల్ల రిజర్వాయర్ను పూర్తి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, రెండున్నర సంవత్సరాలు గడిచినా ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో గంధమల్ల రిజర్వాయర్ను పూర్తి చేసి ఆలేరు ప్రాంత రైతుల చిరకాల సాగునీటి కలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
అలాగే దేవాదుల ప్రాజెక్టులో భాగంగా టంగుటూరు, పటేల్గూడెం, కందిగడ్డ తండా, షరాజీపేట, తూర్పుగూడెం, గోలనుకొండ గ్రామాల వరకు కాలువలు నిర్మించి పనులు నిలిపివేయడంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతోందని అన్నారు. అశ్వరావుపల్లి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం ఈ నెల 29, 30 తేదీల్లో భువనగిరి జిల్లా కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు పాదయాత్ర నిర్వహించినట్లు సత్యరాజయ్య తెలిపారు. నేటి ధర్నాకు రైతాంగం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కారే రాజు, అంగడి నరేష్, అంగడి శ్రీనివాస్, చౌడబోయిన యాదగిరి, చౌడబోయిన సుధాకర్, దండు ఐలయ్య, సత్తయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.






