కదిరిలో ఘోర ప్రమాదం: గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురు మృతి
పుట్టపర్తి: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో(Satya Sai district) బుధవారం గ్యాస్ సిలిండర్లు, డిటోనేటర్లు పేలి నలుగురు మరణించారని పోలీసులు తెలిపారు. ఓ కూలీ నివాసంలో నిల్వ ఉంచిన 4 డిటోనేటర్లు పేలి ప్రమాదం సంభవించింది. ఇంట్లో ఉన్న డిటోనేటర్లు పేలి గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకున్నాయి. డిటోనేటర్లు, సిలిండర్లు పేలి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో 21 మందికి గాయాలు కాగా, ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
జిల్లాలోని కమ్మరవారిపల్లి గ్రామంలో సిలిండర్ల పేలుడు ధాటికి ఐదు ఇళ్లు కూలిపోయాయని పోలీసు సూపరింటెండెంట్ ఎస్. సతీష్ తెలిపారు. "కదిరి మండలంలోని కమ్మవారిపల్లి గ్రామంలో మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో నలుగురు మరణించారు," అని సతీష్ తెలిపారు. పేలుడు సంభవించిన ఆ ఇంట్లో తెలంగాణకు చెందిన కార్మికులు నివసిస్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.






