12 August, 2026 | 11:48 AM

హెచ్‌సీయూ క్యాంపస్‌లో గంజాయి విక్రయం.. మాజీ విద్యార్థి అరెస్ట్

12-08-2026 11:13 AM

శేరిలింగంపల్లి,ఆగస్టు 12 (విజయక్రాంతి): యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (Hyderabad Central University) క్యాంపస్‌లో గంజాయి విక్రయిస్తున్న మాజీ విద్యార్థిని గచ్చిబౌలి పోలీసులు, సైబరాబాద్ ఈగల్ టీమ్ సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుడు భిస్వజిత్ కలితా బిస్వా (28)గా గుర్తించారు. అతని వద్ద నుంచి ఐదు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.ఇటీవల హెచ్‌సీయూ మెన్స్-ఎల్ హాస్టల్‌లో గంజాయి సేవిస్తున్న విద్యార్థులపై పోలీసులు తనిఖీలు నిర్వహించగా, ఓ విద్యార్థి భిస్వజిత్ వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.

ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఈ నెల 11న క్యాంపస్‌లోనే అతనిని అదుపులోకి తీసుకున్నారు.నిందితుడు గతంలో హెచ్‌సీయూలో చదువుకున్నాడని, ప్రస్తుతం గోపన్‌పల్లిలో ఉంటూ యాక్టర్ ట్రైనర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎన్‌డీపీఎస్ చట్టం కేసులో అతడు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించి, గంజాయి సరఫరా వెనుక ఉన్న వ్యక్తులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.