5 August, 2026 | 7:27 PM

ఎమ్మెల్యే క్యాంపు ముట్టడిస్తాం

05-08-2026 06:39 PM

టీఆర్ఎస్ బెల్లంపల్లి ఇంచార్జీ బోడ జనార్ధన్ 

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి కార్మిక వాడల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోతే ఎమ్మెల్యే గడ్డం వినోద్ క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని తెలంగాణ రక్షణ సేన ( టిఆర్ఎస్) బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి బోడ జనార్ధన్ హెచ్చరించారు. బుధవారం బెల్లంపల్లిలోని పలు కార్మిక వాడల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2018 లో సింగరేణి సింగరేణి క్వార్టర్లను ప్రభుత్వానికి సరెండర్ చేసి నివాసులకు పట్టాలిచ్చారన్నారు. కార్మిక వాడల్లో రహదారులు, డ్రైనేజీ, ముఖ్యంగా విద్యుత్ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.

సింగరేణి యాజమాన్యం కార్మిక వాడల పర్యవేక్షణను విస్తరించిందన్నారు. విద్యుత్తు సరఫరాను నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కరెంటు పోయిన క్వార్టర్లకు తిరిగి విద్యుత్ ను ఇవ్వడం లేదన్నారు. ఇలా చేస్తే కార్మిక కుటుంబాలు ఎలా జీవనం సాగిస్తాయని వాపోయారు. కార్మికులు, ప్రజలు అనేక సమస్యలతో అవస్థలు పడుతుంటే?ఎమ్మెల్యే గడ్డం వినోద్ హైదరాబాద్లో ఉంటున్నారని దుయ్యబట్టారు. బెల్లంపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నాడా? లేడా? అనే పరిస్థితి నెలకొందన్నారు. పుట్టడు సమస్యలతో కార్మిక కుటుంబాలు సతమతమవుతున్నాయని వాపోయారు. కార్మిక వాడల్లో ఇన్ని సమస్యలు ఉన్నాయో తన పర్యటనతో స్వయంగా చూశానన్నారు.

కార్మిక కుటుంబాల సమస్యలను గాలికి వదిలేస్తున్న ఎమ్మెల్యే వినోద్ ను నిలదీసే  రోజు వచ్చిందన్నారు. పట్టణంలోని బెల్లంపల్లి బూడిది గడ్డ బస్తి, కన్నాలబస్తి, ఇంక్లైన్ బస్తి ఒకటేమిటి అన్ని బస్తీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పురపాలక సంఘం, ఎమ్మెల్యే వినోద్ పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. ప్రజల సమస్యలపై పోరాడేందుకు కార్యచరణ ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శశికాంత్ , నెన్నెల మండల అధ్యక్షుడు దుర్గం బానేష్ , యువజన విభాగం నాయకులు శ్రావణ్,స్వరాజ్,రేవంత్ తదితరులు పాల్గొన్నారు.