ఆసుపత్రి పరిధిలో మొదటి ఐవీఎఫ్
గాంధీలో ఐవీఎఫ్ పద్ధతిలో బిడ్డ జననం
సికింద్రాబాద్, ఫిబ్రవరి25 (విజయక్రాంతి): గాంధీ ఆసుపత్రిలో తొలిసారిగా ఇన్విట్రో ఫర్టిలైజేషన్ (ఐవీఎఫ్) విధానంలో శిశువు జన్మించింది. అల్వాల్కు చెందిన శృతి అనే మహిళకు ఈ నెల 7న ఆడ శిశువు జన్మించినట్లు వైద్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇదే తొలి ఐవీఎఫ్ ప్రసవం కావడం విశేషం. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలో డిశ్చార్జ్ చేయనున్నట్లు డాక్టర్లు వెల్లడించారు.
సాధార ణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ చికిత్సకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఖర్చు అవుతుండగా, గాంధీ ఆసుపత్రి వైద్యులు ఈ చికిత్సను పూర్తిగా ఉచితంగా అందించారు.ఈ విజయంపై డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్ వైద్య బృందాన్ని అభినందించారు.
అలాగే గాంధీ ఆసుపత్రితో పాటు పెట్లబుర్జ్ గవర్నమెంట్ హాస్పిటల్, వరంగల్ రిమ్స్, ఆదిలాబాద్ రిమ్స్ లలో కూడా ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు నరేంద్ర కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం ప్రజలకు గొప్ప ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు. కార్యక్రమంలో గాంధీ ఆసుపత్రి డాక్టర్లు, నోడల్ ఆఫీసర్ డాక్టర్ సునీత, గాంధీ ఐవీఎఫ్ సెంటర్ హెడ్ డాక్టర్ శోభ తదితరులు పాల్గొన్నారు.




