24-02-2026 12:00:00 AM
ప్రజావాణిలో పిర్యాదులను స్వీకరించిన అదనపు జిల్లా ఎస్పీ మహేందర్
మెదక్, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి) : మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు జిల్లా ఎస్పీ ఎస్. మహేందర్ ప్రజల నుండి పిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని పలు గ్రామాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు, వివాదాలు, పోలీసు సంబంధిత ఇబ్బందులను అదనపు ఎస్పీకి నేరుగా వివరించారు. ఈ సందర్భంగా ప్రతి ఫిర్యాదుదారునితో అదనపు ఎస్పీ వ్యక్తిగతంగా మాట్లాడి, వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. అందిన పిర్యాదులను క్షుణ్నంగా పరిశీలించి, సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కొన్ని కేసుల విషయంలో సంబంధిత ఎస్హెచ్ఓలతో ఫోన్లో మాట్లాడి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ, పోలీస్ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఎలాంటి పైరవీలు అవసరం లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలని సూచించారు.
చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను వెల్లడించాలని, పోలీస్ వ్యవస్థ పూర్తిగా ప్రజల కోసమేనని స్పష్టం చేశారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కారమై, ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం మరింత పెరుగుతోందని అదనపు ఎస్పీ పేర్కొన్నారు.