విద్యుదాఘాతంతో రైతు మృతి
- పొలంలో కరెంటు తీగలు తగలడంతో ప్రమాదం
- మెదక్ జిల్లా నామాపూర్లో ఘటన
పాపన్నపేట, ఫిబ్రవరి 25(విజయక్రాంతి):విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధి నామాపూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ దేవిదాస్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన గనాజిగారి నర్సింలు(49) వ్యవసాయం చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు. పొలం వద్ద పనుల కోసం బుధవారం ఉదయం ఇంటి నుంచి పొలం వద్దకు వెళ్లాడు.
పొలంలో అడవి పందుల కోసం రక్షణగా ఏర్పాటు చేసిన కరెంటు తీగకు తగిలి విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఫోన్ చేసిన స్పందించకపోవడంతో సమీపంలో ఉన్న పొలాల వద్ద ఉన్న స్థానికులకు ఫోన్ చేయగా వారు వెళ్లి చూడగా రైతు మృతి చెంది ఉండడం గమనించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి భార్య బాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు.




