04-02-2026 12:12:56 AM
దిల్సుఖ్నగర్లోని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కు జరిమానా విధించిన వినియోగదారుల కమిషన్
ఎల్బీనగర్, ఫిబ్రవరి 3 : వైద్యపరీక్షలు కోసం వస్తే తప్పుడు రిపోర్టులు ఇచ్చిన డయాగ్నోసిస్ సెంటర్ పై వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా విధించింది. తన రిపోర్టులు తప్పుగా ఇచ్చారని ఒక గర్భిణి వేసిన కేసుపై మంగళవారం వినియోగదారుల కమిషన్ తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే... భార్గవి అనే మహిళ గర్భిణి సమయం లో గైనకాలజిస్ట్ సూచన మేరకు ఎన్టీ స్కాన్ కోసం దిల్సుఖ్నగర్ ప్రాంతంలోని విజయ డయాగ్నొస్టిక్ సెంటర్కు వెళ్లింది.
డయాగ్నోసిస్ సెంటర్ సిబ్బంది స్కాన్ చేసి సాధార ణంగా ఉన్నాయని రిపోర్టులు ఇచ్చారు. ఎంతకైనా మంచిదని అనుమానంతో వేరే డయాగ్నోస్టిక్ సెంటర్లో పరీక్ష చేసుకోగా, కడుపులోని శిశువు మెడపై 11ఎంఎం సిస్ట్ ఉందని అక్కడి సిబ్బంది రిపోర్టులు ఇచ్చా రు. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ రిపోర్టులను నమ్ముకుని ముందుకు వెళ్తే తల్లీబిడ్డల ప్రాణాలకు ప్రమాదం కలిగేదని, డాక్టర్ సూచన మేరకు గర్భం తొలగించుకున్నానని తెలిపారు.
విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ తప్పుడు రిపోర్టులపై వినియోగదారుల కమిషన్కు భార్గవి ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన వినియోగదారుల కమిషన్ డయాగ్నోసిస్ సెంటర్ వైద్యసిబ్బంది నిర్లక్ష్యాన్ని గుర్తించారు. నిర్లక్ష్యపు వైఖరితో రిపోర్టులు ఇచ్చారని, బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం, రూ.20 వేలను కేసు ఖర్చులు, పరీక్ష ఫీజు రూ.1,700 చెల్లించాలని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కు వినియోగదారుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.