15-02-2026 12:00:00 AM
ఓటు హక్కు వినియోగంచుకోనున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు
కరీంనగర్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్తో పాటు రాయికల్, మెట్పల్లి, జమ్మికుంట, వేములవాడ మున్సిపాలిటీల్లో ఎక్స్ ఆఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఓటు హక్కు కలిగి ఉంటారు. కీలక సమయాల్లో వారి ఓటు ముఖ్యం కానుంది.
కరీంనగర్ నగరంలో 66 డివిజన్లు ఉండగా 30 డివిజన్లలో బీజేపీ విజయం సాధించింది.అయితే మ్యాజిక్ ఫిగర్కు నాలుగు సీట్లు తక్కువ ఉండడంతో ముగ్గురు స్వతంత్రులతోపాటు ఎక్స్ అఫీషియో ఓట్లు అవసరం పడనున్నాయి. ముగ్గురి కంటే ఎక్కువ స్వతంత్రులు బీజేపీవైపు వచ్చే అవకాశం ఉన్నా కరీంనగర్ నగరపాలక సంస్థలో కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ మల్క కొమురయ్యలు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండిలో వినియోగించుకోనున్నారు. అయితే అక్కడ. కాంగ్రెస్ కు ఈ ఓటు తప్పనిసరి ఏం కాదు. వేములవాడలో కాం గ్రెస్ పార్టీకి ఒక ఓటు కీలకం కానుండగా అక్కడ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వినియోగించుకోనున్నారు. మంత్రి అడ్లూరి ధర్మపురిలో వినియోగించుకోనున్నారు. మంత్రి శ్రీధర్బాబు మంథనిలో వినియోగించుకోనున్నారు. జమ్మికుంటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. హుజురాబాద్ కాంగ్రెస్కు దక్కడంతో జమ్మికుంటలో చక్రం తిప్పే ఆలోచనలో ఉన్నారు. రాయికల్ లో హంగ్ ఏర్పడడంతో ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాలలో వినియోగించుకుంటారా, లేదా రాయికల్లో వినియోగించుకుంటారా అనేది చూడాలి.