21-02-2026 12:31:03 AM
చేవెళ్ళ, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): చేవెళ్ళలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్ ) విద్యార్థులు పార్లమెంటు కార్యకలాపాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. శుక్రవారం పాఠశాల ప్రిన్సిపాల్ వినోద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ ’మాక్ పార్లమెంట్’ కార్యక్రమం ఆలోచింపజేసేలా సాగింది.
కార్యక్రమంలో విద్యార్థులు అధికార, ప్రతిపక్ష పార్టీలుగా విడిపోయి దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వాడీవేడీగా చర్చించారు. ముఖ్యంగా మహిళా, శిశు రక్షణ పై ప్రశ్నోత్తరాల సమయంలో దేశంలో మహిళలు, పిల్లల భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రతిపక్షాలు నిలదీయగా, అధికార పక్షం వివరణ ఇచ్చింది.కోవిడ్ అనంతర పరిస్థితుల్లో కుదేలైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను విద్యార్థులు చర్చించారు.
యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు.ఆకట్టుకున్న పార్లమెంటరీ.... కేవలం చర్చలకే పరిమితం కాకుండా, పార్లమెంటరీ నిబంధనలను అతిక్రమించే సభ్యులను మార్షల్స్ ద్వారా సభ వెలుపలికి పంపే సన్నివేశాలను ప్రదర్శించి, సభా మర్యాదలను విద్యార్థులు చాటిచెప్పారు. భవిష్యత్ పౌరులకు ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ప్రిన్సిపాల్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షాహినాబేగం, పీడీ ఆంజనేయులు, శ్రీనివాస్, మహేశ్వరావు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.