శంషాబాద్ ఎయిర్ పోర్టులో ‘ఎబోలా’ వైరస్ కలకలం
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో(Shamshabad Airport) గురువారం ఎబోలా వైరస్ కలకలం రేపింది. శంషాబాద్ ఆర్జీఐఏకు చేరుకున్న సూడాన్కు చెందిన ఒక ప్రయాణికుడికి ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన స్కానర్ ద్వారా ఎబోలా వైరస్ లక్షణాలు(Ebola Virus Symptoms) కనిపించడంతో అతడిని గాంధీ ఆసుపత్రికి(Gandhi Hospital) తరలించారు. నిర్ణీత అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికను అనుసరించి, సూడాన్ నుండి వచ్చిన ప్రయాణికుడిని ఒక ప్రత్యేక అంబులెన్స్ ద్వారా గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు వేగంగా తరలించారు.
వైద్యులు రోగి నుండి నమూనాలను సేకరించి, నిర్ధారణ పరీక్షల నిమిత్తం పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (National Institute of Virology)కి పంపారు. వ్యాధి నిర్ధారణను ధృవీకరించుకోవడానికి అధికారులు ప్రస్తుతం రిపోర్ట్స్ కోసం వేచి చూస్తున్నారు. పలు ఆఫ్రికన్ దేశాలలో కొనసాగుతున్న ఎబోలా పరిస్థితి దృష్ట్యా, తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అన్ని ప్రవేశ మార్గాల వద్ద నిఘాను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఎబోలా నిర్వహణకు గాంధీ ఆసుపత్రిని అధికారికంగా నోడల్ కేంద్రంగా ప్రకటించారు. ఏవైనా సంభావ్య కేసులను ఎదుర్కోవడానికి ప్రత్యేక ఐసోలేషన్ సౌకర్యాలు, వైద్య బృందాలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు.






