అటవీ కళాశాలలో ఘనంగా ధరిత్రి దినోత్సవం
గజ్వేల్, ఏప్రిల్ 22: సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్సీఆర్ఐ)లో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో డీన్ బి. ప్రవీణ నేతృత్వంలో నిర్వహించగా, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని కళాశాల సమీపంలోని ప్రధాన రహదారి వెంబడి పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి శుభ్రపరిచారు. అలాగే వేసవి కాలంలో పక్షుల దాహార్తిని తీర్చేందుకు వివిధ ప్రదేశాల్లో నీటి తొట్లను ఏర్పాటు చేశారు. అనంతరం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను సందర్శించి ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన పొందారు.
ఈ సందర్భంగా డీన్ బి. ప్రవీణ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో ప్లాస్టిక్ వినియోగం కారణంగా పర్యావరణం, నేల తీవ్రంగా కలుషితమవుతున్నాయన్నారు. భవిష్యత్ తరాల కోసం ధరిత్రిని రక్షించడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. అటవీ కళాశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో ముందుండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.ఎస్. శ్రీనిధి తదితరులు పాల్గొన్నారు.






