22 June, 2026 | 2:03 AM

రాజీ మార్గమే రాజ మార్గం

21-06-2026 03:36 PM

లోక్ అదాలత్‌ లో కేసుల పరిష్కారంలో కృషి చేసిన పోలీస్ అధికారులను సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ.

రాజన్న సిరిసిల్ల.(విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించిందని, దీని ద్వారా అనేక కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు రూ.22.31 లక్షలకు పైగా రిఫండ్ మొత్తాన్ని అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీకి అవకాశం ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టగా, జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదు అయిన అండర్ ఇన్వెస్టిగేషన్, కోర్టు విచారణలో ఉన్న 265 కేసులు, 23 పెట్టి కేసులు, 1043 డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు, 2419 ట్రాఫిక్ చలాన్ కేసులు, 75 సైబర్ క్రైమ్ కేసులు విజయవంతంగా పరిష్కరించబడ్డాయని తెలిపారు. అదేవిధంగా సైబర్ నేరాల బాధితులకు సంబంధించిన వివిధ బ్యాంకు ఖాతాల్లో నిలుపుదల చేసిన రూ.22,31,235/- మొత్తాన్ని బాధితులకు తిరిగి అందజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు.

"రాజీ మార్గమే రాజమార్గం" అనే భావనతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ కేసుల పరిష్కారానికి కృషి చేసిన అదనపు ఎస్పీ చంద్రయ్య, కోర్టు మానిటరింగ్ ఎస్‌ఐలు రవీందర్ నాయుడు, శ్రావణ్ యాదవ్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుళ్లు, వివిధ పోలీస్ స్టేషన్ల కోర్టు కానిస్టేబుళ్లు, పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. లోక్ అదాలత్ విజయవంతం కావడంలో సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రతినిధులకు జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.