ఎఫ్ఎల్ఎన్ లక్ష్య సాధనలో కలిసి పనిచేద్దాం
ముకరంపుర,(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రస్తుతం మిషన్ ప్రాతిపదికన ఎఫ్ఎల్ఎన్ ప్రగతి కోసం పనిచేస్తుండడంతో అందులో జిల్లా అగ్రగామిగా రావడానికి సమిష్టిగా పనిచేద్దామని జిల్లా విద్యాధికారి చైతన్య జైనీ మండల విద్యాధికారులు మరియు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో పిలుపునిచ్చారు. రాష్ట్ర విద్యాశాఖ ఇటీవల బేస్ లైన్ టెస్ట్ ఫలితాల మీద ఇచ్చిన సమగ్ర రిపోర్టు మీద పూర్తిస్థాయి సమీక్ష జరిగింది.
ఒక్కొక్క సబ్జెక్టులో ఒక్కొక్క సామర్థ్యంలో జిల్లా స్థాయిలో కాంపిటెంట్ మరియు నాన్ కాంపిటెంట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రగతి మీద పరిశీలన జరిగి, తదనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించడంలో అధికారులు అందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. కాంపిటెంట్ స్కూళ్ళలో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో త్వరలో ఒక ఓరియెంటేషన్ నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. వెనకబడి ఉన్న సామర్థ్యాల మీద అనుగుణమైన కార్యాచరణ ప్రణాళిక చేయాలని తెలిపారు.
అలాగే ఏకరూప దుస్తులు, జిల్లా పరీక్షల నిర్వహణ, అపార్, స్పర్శ్ అంశాల మీద పూర్తిస్థాయిలో పనిచేయాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే జిల్లా విద్యాశాఖ దృష్టికి తేవాలని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం పూర్తిస్థాయి లక్ష్యం ఎఫ్ ఎల్ ఎన్ సాధన అని గుర్తెరిగి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని, ప్రాథమిక స్థాయిలో నాణ్యమైన విద్య సాధించినప్పుడే విద్య ప్రగతిశీలంగా ఉంటుందని సూచించారు.ఈ కార్యక్రమంలో క్వాలిటీ కో ఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఏ ఎమ్ ఓ శ్రీనివాస్, ప్లానింగ్ కో ఆర్డినేటర్ మిల్కూరి శ్రీనివాస్, డిసీఈబి సెక్రటరీ భగవంతయ్య , మండల విద్యాధికారులు మరియు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, అకాడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.






