ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు.
పేట ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ
అశ్వారావుపేట, (విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని డాక్టర్లు, ఇతర సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి వారి హాజరు, విధుల నిర్వహణపై ఆరా తీశారు. ఆసుపత్రి సిబ్బంది ఎన్ని షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించిన కలెక్టర్, ప్రసూతి వార్డులో చికిత్స పొందుతున్న మహిళల సంఖ్య, వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. డయాలసిస్ వార్డును సందర్శించి మూడు షిఫ్టుల్లో రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నట్లు వైద్యులు వివరించారు. జనరల్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవల నాణ్యత, మందుల లభ్యత, వైద్యులు, సిబ్బంది స్పందనపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామనిబి హెచ్చరించారు.అనంతరం అశ్వారావుపేట గిరిజన బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పోషకాహారం అందించాలని వార్డెన్కు సూచించారు. వసతి గృహంలో పరిశుభ్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా వసతి గృహం భవనం పైకప్పు నుంచి వర్షపు నీరు లీకేజీ అవుతున్న విషయాన్ని కలెక్టర్ గమనించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే పైకప్పుకు మరమ్మతులు చేపట్టాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు సురక్షితమైన, అనుకూలమైన వాతావరణంలో వసతి కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు.






