ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలి
వర్కర్ల నియామకంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం
ఎస్పీ నితికా పంత్
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో ఇంటి యజమానులు తమ ఇళ్లలో పనిచేసే వంటమనుషులు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, సహాయకులు తదితరుల పూర్తి వివరాలను తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదు చేయించాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ సూచించారు. అద్దె గదులు ఇచ్చే యజమానులు కూడా అద్దెదారుల వివరాలను ముందుగానే పోలీసులకు తెలియజేసి వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు.
భద్రతా పరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇంటి పనుల కోసం నియమించుకునే వ్యక్తుల ఆధార్ కార్డు, ఫోటో, మొబైల్ నంబర్, ప్రస్తుత చిరునామా వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా అనుమానాస్పద ఘటనలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఉద్యోగాల్లో నియమించుకునే సందర్భాల్లో వ్యక్తుల పూర్తి ధృవీకరణ అనంతరమే పనిలోకి తీసుకోవాలని సూచించారు.
ఇంటి యజమానులు ముందస్తుగా వివరాలు నమోదు చేయిస్తే ఎటువంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినా వెంటనే గుర్తించే అవకాశం ఉంటుందని, ప్రజలకు మరింత సురక్షిత వాతావరణం కల్పించవచ్చని తెలిపారు. జిల్లా ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని ఆమె స్పష్టం చేశారు.






