17-02-2026 09:16:35 PM
సనత్నగర్(విజయక్రాంతి): శివాబాగ్ కాలనీలో సైబర్ నేరాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ రమణారెడ్డి హాజరయ్యారు. అదనపు డీసీపీ శ్రీకాంత్, ఏసీపీ రాఘవేంద్ర రావు, ఇన్స్పెక్టర్ శ్రీనివాస రెడ్డి, ఎస్ఐ రాజు రాథోడ్, మధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, రోజురోజుకీ పెరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీలు, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియజేయరాదని తెలిపారు.
సోషల్ మీడియాలో అపరిచితుల నుండి వచ్చే లింకులు, మెసేజ్లు, ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదైనా సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేయాలని, అలాగే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. యువత, మహిళలు ప్రత్యేకంగా సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. స్థానికులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ.. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని కోరారు.