28 April, 2026 | 3:04 AM

పాలకవర్గాలకు కనువిప్పు కలిగేలా మేడే ఉత్సవాలు నిర్వహించాలి

28-04-2026 01:28 AM

సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి

భద్రాచలం, ఏప్రిల్ 27,(విజయక్రాంతి): కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకవర్గాలకు కనువిప్పు కలిగేలా కార్మికులు, కర్షకులు ఐక్యంగా మేడే ఉత్సవాలను నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి లు పిలుపు నిచ్చారు. సోమవారం సిపిఎం పార్టీ పట్టణ స్థాయి జనరల్ బాడీ సమావేశం వై వెంకట రామారావు అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 140 ఏళ్ల క్రితం అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మికుల హక్కుల కోసం జరిగిన నిరసన ర్యాలీపై ప్రభుత్వం జరిపిన దమనకాండ ఫలితంగా ప్రాణాలు కోల్పోయిన కార్మికుల రక్తం నుండి పుట్టినది ఎర్ర జెండా అని ఆ జెండా నీడలోనే కార్మికుల హక్కులు సాధించబడ్డాయని అన్నారు. అనేక పోరాటాలు ఉద్యమాలు ఫలితంగా సాధించుకున్న హక్కులను నేడు దేశాన్ని పాలిస్తున్న పాలకులు కాలరాస్తున్నారని ఆ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు కర్షకులు సమస్త ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలన్నారు.

నాటి మేడి అమరవీరుల స్ఫూర్తితో పాలకవర్గాలు అనుసరిస్తున్న కార్పొరేట్ పెట్టుబడిదారుల విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచ కార్మికుల దినోత్సవం ‘మే డే‘ వాడవాడలా పెద్ద సంఖ్యలో కార్మికులు కర్షకులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి సంతోష్ కుమార్ డి సీతాలక్ష్మి సీనియర్ నాయకులు బిబిజి తిలక్,పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి,యు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.