12 August, 2026 | 7:52 PM

కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలి

12-08-2026 06:06 PM

 హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ధర్నా

 తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత

 జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కేసును తక్షణమే విత్ డ్రా చేసుకోవాలి

​హుజూరాబాద్,(విజయక్రాంతి): జర్నలిస్టుల నివేశన స్థలాలపై వేసిన కోర్టు కేసును ఉపసంహరించుకోకుండా తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డిని వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హుజూరాబాద్ ప్రెస్ క్లబ్, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కరీంనగర్ జిల్లాహుజూరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట గంటపాటు నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ జక్కని నరేందర్‌కు వినతిపత్రం అందజేశారు.

​ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు, కార్యదర్శి కామని రవీందర్ లు మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీ క్యాంప్‌లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఆర్డీవో ఉత్తర్వుల మేరకు మున్సిపల్ అధికారులు హౌస్ నంబర్లు కేటాయించగా, జర్నలిస్టులు లక్షలాది రూపాయలు వెచ్చించి గృహాలు నిర్మించుకున్నారని పేర్కొన్నారు. అయితే, హుజూరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరు రాజేశ్వరి భర్త, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ గూడూరు అంజలి మామ అయిన కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డి అక్కసుతో కోర్టులో కేసు వేశారని మండిపడ్డారు. మూడేళ్లుగా ఆ కేసును ఉపసంహరించుకోకుండా జర్నలిస్టులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

​నెరవేరని హామీలు

ఈ సమస్యపై రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రణవ్ బాబులకు వినతిపత్రాలు ఇచ్చినా పరిష్కారం లభించలేదని నిరసనకారులు వాపోయారు. కేసు విత్‌డ్రా చేయిస్తామని నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రణవ్ బాబు హామీ ఇచ్చినా అమలు కాలేదని విమర్శించారు. గూడూరు స్వామిరెడ్డి తన నిరంకుశ వైఖరిని వీడి వెంటనే కోర్టు కేసును ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ​ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు చందుపట్ల జనార్ధన్, వేల్పుల రత్నం, మార్త రవీందర్, వేల్పుల ప్రభాకర్, దేవసాని ప్రియదర్శిని, సృజన, సందెల వెంకన్నలతో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.