1 July, 2026 | 1:53 AM

రేపు కాలేజీల బంద్

01-07-2026 12:00 AM

15న బీసీ విద్యార్థుల చలో హైదరాబాద్

రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు ఉద్యమం

బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

ముషీరాబాద్/ఎల్బీనగర్, జూన్ 30 (విజయక్రాంతి): పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల బంద్ చేపట్టనున్నట్లు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.

మంగళవారం హైదరాబాదు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద కాలేజీల బంద్ పోస్టర్‌ను బీఆర్‌ఎస్ శాసన మండలి ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసూదనాచారి, సిపిఐ నాయకులు, మాజీ ఎంపీ అజీజ్ పాష, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ తదితరులు కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి మూడు బడ్జెట్ లు ప్రవేశపెట్టినప్పటికీ రాష్ర్టంలోని14 లక్షల మంది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రావ లసిన 7వేల కోట్ల ఫీజుల బకాయిలను విడుదల చేయకుండా పేద విద్యార్థులను ఉన్నత విద్య నుండి దూరం చేయాలని కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. అప్పుల్లో బీసీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 90% రుద్దుతున్న ప్రభుత్వం, ప్రభుత్వ ఆదాయంలో 90 శాతం నిధులు ఎందుకు ఖర్చు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వం ఆదాయం అంతా బడాబడా కాంట్రాక్టర్లకు దోచిపెడుతుందని ఆయన మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా పాత పద్ధతిలోనే అమలు చేసే వరకు, పదివేల ర్యాంకు నిబంధనను ఎత్తివేసే వరకు, ఫీజుల బకాయిలను పూర్తిగా విడుదల చేసే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. ఫీజు రీయిం బర్స్మెంట్ విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడుతుందన్నారు. 

మాజీ ఎంపీ అజీజ్ పాషా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి బీసీ జేఏసీ చేస్తున్న ఆందోళనకు సిపిఐ పార్టీగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కుర్మా, బీసీ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు రావులకోల్ నరేష్ ప్రజాపతి, బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గూడూరు భాస్కర్ మేరు, బీసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తారాకేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

కొత్తపేటలో కళాశాలల బహిష్కరణ

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని, పెండింగ్ బకాయిలను వెంటనే మంజూరు చేసి, పేద విద్యార్థుల ఉన్నత చదువులకు సహకరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం కోరారు. పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తపేటలోని కళాశాలల్లో తరగతులను బహిష్కరించారు. విద్యార్థులతో కొత్తపేట చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.