ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలతో పాటు గుడిసెల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ, డీఆర్డీఓ, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. జిల్లాకు 4,562 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 851 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. సెప్టెంబర్ 15 నాటికి లక్ష్యాలను సాధించేలా నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు.
భూపాలపల్లి మండలంలో అదనంగా 200 ఇళ్లు, నియోజకవర్గంలో మొత్తం 1,100 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రారంభం కాని ఇళ్ల విషయంలో కారణాలను గుర్తించి లబ్ధిదారులతో మాట్లాడి పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. అర్హులైన పేద కుటుంబాలు ఏవీ మిగిలిపోకుండా గుడిసెల సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు. భాస్కర్గడ్డ 2బీహెచ్కే లేఅవుట్లో మురుగునీటి పారుదల, విద్యుత్, తాగునీటి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీఓ బాలకృష్ణ, పీఆర్ ఈఈ విద్యాసాగర్, డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, ఏఈ రాయలింగు, ఎంపీడీఓలు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.






