నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత సి.జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం కాన్వాయ్లో బయల్దేరిన టీవీకే అధినేత విజయ్ 10 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. విజయ్ తో సీఎంగా గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. విజయ్ తో పాటు మరో 9 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు.
ప్రమాణస్వీకారానికి ముందే మంత్రులకు శాఖల కేటాయించారు. మంత్రులుగా ఎన్. ఆనంద్, ఆధవ అర్జున, కే.జీ.అరుణ్ రాజ్, కే.ఎ.సెంగోటియన్, పీ.వెంకటరమన్, నిర్మల్ కుమార్, ఎ.రాజ్ మోహన్, టీ.కే. ప్రభు, ఎస్.కీర్తన ప్రమాణం స్వీకారం చేశారు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన వారిలో రాహుల్ గాంధీ, విజయ్ తల్లిదండ్రులైన ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్, అలాగే త్రిష కృష్ణన్తో సహా తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు.
ప్రమాణ స్వీకారనంతరం విజయ్ మాట్లాడుతూ... డైరెక్టర్ కుమారుడు నేడు ముఖ్యమంత్రి అయ్యాడని, నేను మీ అందరివాణ్ని అని చెప్పారు. ఎన్నో కష్టాలను అధిగమించి ఈ స్థాయికి వచ్చా అని, నన్ను ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారని ఆయన వాపోయ్యారు. అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని, ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పై విజయ్ తొలి సంతకం చేశారు. యాంటీ డ్రగ్స్ ఫోర్స్ దస్త్రంపై రెండో సంతకం, మహిళల రక్షణకు ప్రత్యేక దళం దస్త్రంపై మూడో సంతకం చేశారు. టీవీకేలో ఒకే ఒక అధికార కేంద్రం ఉంది.. అది విజయ్ మాత్రమే అని, తమిళనాడులో ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చిందని విజయ్ కొనియాడారు.
హామీల అమలుకు కొంత సమయం ఇవ్వండి అని, డీఎంకే ప్రభుత్వం.. ఖజానా ఖాళీ చేసి వెళ్లిందని ఆరోపించారు. తమిళనాడుకు ఇది సరికొత్త ప్రారంభమని, తమిళనాట లౌకిక, సామాజిక, న్యాయశకం మొదలైందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సాధ్యమయ్యేవే చెబుతాం.. చెప్పిందే చేస్తాం, ప్రభుత్వ ఏర్పాటుకు మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మిత్రులైనా శత్రువులైనా, అందరికీ ఒకే చట్టం అని, విజయ్ మామ.. విద్యార్థులకు అన్ని మంచి పనులు చేస్తాడని తమిళనాడు సీఎం హామీ ఇచ్చారు.






