డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం సీఎం కృషి
పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా.కోట నీలిమ
సికింద్రాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): తెలంగాణలో డ్రగ్స్ సంస్కృతికి బీఆర్ఎస్ నాయకులే మూల కారణమని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ మండిపడ్డారు. ఇలాంటి కీలక సందర్భంలో డ్రగ్స్ టెస్ట్ చేసుకొని నేతలు నిజాయితీని చాటుకోవాలని సూచించారు. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ పార్టీ అంశంపై డాక్టర్ కోట నీలిమ స్పందించారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ ను డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మార్చిందన్నారు.
రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంటే, బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. మరోవైపు డ్రగ్స్ అనేవి కేవలం మత్తు పదార్థాలు మాత్రమే కాదు అవి ఒక తరాన్ని నిర్వీర్యం చేసే విష గుళికలని అన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు.




