హెచ్డీఎఫ్సీ CSR పనులను ప్రారంభించిన సీఎం రేవంత్
రుణాలు చెల్లింపులో మహిళలు భేష్: సీఎం రేవంత్
హైదరాబాద్: హెచ్డీఎఫ్సీ బ్యాంకు తన కార్పొరేట్ సామాజిక బాధ్యత(CSR) నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రారంభించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన కార్యక్రమంలో HDFC సమకూర్చిన రెండు ఆంబులెన్స్లకు ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. భూపాలపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సమకూర్చిన ఎంఆర్ఐ స్కానర్ను వర్చువల్గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల నుంచి రుణాల చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయని పేర్కొంటూ మహిళా సంఘాలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని కోరారు. స్వయం సహాయక సంఘాలతో లాజిస్టిక్ పార్కులు, గోడౌన్లు, రైస్ మిల్లులు ఏర్పాటు చేస్తున్నామని, అందుకోసం పెద్ద ఎత్తున రుణాలివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు , హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






