18-02-2026 12:00:00 AM
న్యాయవాది కోమటిరెడ్డి లక్ష్మీనరసింహారెడ్డి
శంకర్పల్లి, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి): విద్యార్థి జీవితంలో పదవ తరగతి అత్యంత కీలకమైన దశ అని, ఈ పరీక్షల్లో ప్రతిభ చూపడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం అవుతుందని బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు, న్యాయవాది కోమటిరెడ్డి లక్ష్మినరసింహ రెడ్డి అన్నారు. మంగళవారం మహాలింగాపురం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్,
ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు పలు కీలక సూచనలు చేశారు: పదవ తరగతిలో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థికి ఇంటర్మీడియట్ విద్యను తన సొంత ఖర్చుతో చదివిస్తానని ఆయన హామీ ఇచ్చారు.పరీక్షలు ముగిసే వరకు విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, చదువుపైనే పూర్తి దృష్టి సారించాలని సూచించారు.
విద్యార్థులకు ఇంటి పనుల ఒత్తిడి లేకుండా, వారు ప్రశాంతంగా చదువుకునే వాతావరణాన్ని తల్లిదండ్రులు కల్పించాలని కోరారు. ప్రాథమిక పాఠశాల నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కూడా అవసరమైన స్టేషనరీని అందజేశారు.‘ఇష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు. విద్యార్థుల కష్టాన్ని గుర్తించి వారికి అండగా నిలవడమే మా లక్ష్యం.‘ - కోమటిరెడ్డి పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీత లక్ష్మి, లెక్చరర్ ఫోరం అధ్యక్షులు వక్త, తిరుపతి, గ్రామ సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు పల్లవి, అంజయ్య, మాజీ ఎంపీటీసీలు భవాని యాదగిరి, గొల్ల మల్లేశం విద్యార్థులు, పాల్గొన్నారు.