అత్యంత వైభవంగా బోనాల పండుగ
ఘట్ కేసర్, ఆగస్టు 30 (విజయక్రాంతి) : బోనాల పండుగను ఘట్ కేసర్ పట్టణ ప్రజలు ఆదివారం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలు నైవేధ్యంతో కూడిన బోనాలతో శివసత్తుల పూనకాలతో వెంట రాగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలసి అమ్మవారి ఆలయాలకు చేరుకుని సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయాలకు చేరుకోవడంతో భక్తజనులతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి.
ఈ బోనాల ఉత్సవంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం యువకులు తీసిన తొట్టెల, పల హారపుబండి ఊరేగింపులు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.






