18-02-2026 12:15:17 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కీలక సమావేశాన్ని బీజేపీ హైదరాబాద్లో నిర్వహిస్తోంది. నేడు జరిగే వర్క్ షాప్ (కార్యశాల)కు బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధానకార్యదర్శి బీఎల్.సంతోష్తోపాటు, బీజేపీ జాతీయ సహ సంస్థాగత ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, ఇతర నేతలు పాల్గొననున్నారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ఉన్న కార్యకర్తలకు ఈ వర్క్షాప్లో శిక్షణ ఇచ్చి, ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు.
ఈ సందర్భంగా బీఎల్ సంతోష్, శివప్రకాశ్ పార్టీ కార్యకర్తలకు మార్గదర్శనం చేయనున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో బీజేపీ నాయకులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు.
రాష్ట్ర స్థాయి కార్యశాల అనంతరం జిల్లాల వారీగా, మండల స్థాయిలో ఈ శిక్షణ కార్యశాలలను బీజేపీ నిర్వహించబోతుంది. సంస్థాగత అంశాలకు సంబంధించి విస్తృతంగా చర్చించి, అన్ని మండలాల్లో పెద్దఎత్తున ఈ కార్యశాలలను నిర్వహించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ర్టంలో పార్టీని మరింత బలపర్చేలా నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ర్టంలో జరిగిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అధికార దుర్వినియోగం, కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన ధన ప్రవాహం, అకాచకాలను భవిష్యత్తులో సమర్థంగా ఎదుర్కొనేలా కార్యాచరణతో ముందు కెళ్లాలని నేతలు నిర్ణయించారు.రాష్ర్టంలో బీజేపీ ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగానే పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.