ఎస్ఐఆర్పై బీజేపీ కసరత్తు
- ఢిల్లీలో జరిగిన సమావేశంలో పాల్గొన్న రాంచందర్రావు, ఇతర నేతలు
- ఓటర్ల వివరాల సేకరణకుబూత్ స్థాయిలో ఏజెంట్ల నియామకం
- రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసిన పార్టీ పెద్దలు
హైదరాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై బీజేపీ సమాయత్తమవుతోంది. ఈమేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాం చందర్ రావు శనివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడ కేంద్ర పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఎస్ఐఆర్ సమావేశంలో ఆయనతో పాటు రాష్ట్ర సంఘటన ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్, రాష్ట్ర ఇన్చార్జ్ అభయ్ పాటిల్, సునీల్ బన్సల్, ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డితోపాటు ఇతర నేతలు పాల్గొన్నారు. ఈమేరకు రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీ పెద్దలు ఎస్ఐఆర్పై దిశానిర్దేశం చేశారు.
త్వరలో తెలంగాణ తోపాటు పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రతి బూత్ స్థాయిలో ఓ ఏజెంట్ను నియమించాలని పార్టీ ఆదేశించినట్లు తెలిసింది. బూత్ స్థాయిలో ఎన్ని ఓట్లు ఉన్నాయి..అందులో ఏమైనా దొండ ఓట్లు, డబుల్ ఓట్లు, ఒకే ఇం టిపై ఎన్ని ఓట్లు ఉన్నాయి...ఉంటే అవి వాస్తవమా కాదా? అనే వివరాలను ఈ ఏజెంట్లు సేకరిస్తారు.
ఈ వివరాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశముంటుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ బూత్ స్థాయిలో నియమించే ఏజెంట్ల వివరాలను ఢిల్లీ నాయకత్వం ముందు ఉంచినట్లు తెలిసింది. మొత్తంగా రానున్న ఎన్నికల నేపథ్యంలో డబుల్ ఓట్లు, దొంగ ఓట్ల ఏరివేతకు బీజేపీ ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై కూడా పార్టీ పెద్దలతో రాంచందర్ రావు ప్రత్యేకంగా భేటీ అయి వివరించినట్లుగా తెలిసింది.




