తెలంగాణకు బీజేపీ అనుకూలం.. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతాం
కృష్ణా జలాల్లో మనకు అన్యాయం
కేసీఆర్ సంతకం పెట్టడం తొందరపాటే
ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతాం, ప్రజల్లోకి వెళ్తాం: రామచందర్ రావు
హైదరాబాద్: తెలంగాణకు భారతీయ జనతా పార్టీ అనుకూలమని మొదటినుంచే చెప్పిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు గురువారం నిర్వహించిన మీట్ ది ప్రెస్(BJP Chief Ramchander Rao Meet The Press) కార్యక్రమంలో తెలిపారు. బీజేపీ మద్దతు వల్లే లోక్ సభలో యూపీఏ ప్రభుత్వం బిల్లు ప్రవేశ పెట్టిందని గుర్తుచేశారు. ఉన్న ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీలు కూడా లోక్ సభలో ఓటింగ్ కు హాజరుకాలేదని తెలిపారు.
బిల్లు ఓటింగ్ సమయంలో బీజేపీ ఎంపీలంతా హాజరుకావాలని తమ పార్టీ విప్ కూడా జారీ చేసిందని చెప్పారు. 12 ఏళ్లు గడిచినా.. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించలేని దుస్థితి రాష్ట్రంలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో అందరి పాత్ర ఉంది.. ప్రజల పాత్ర ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో తెలంగాణ ఉద్యమం సాగిందని రామచందర్ రావు స్పష్టం చేశారు.
తెలంగాణ వచ్చాక ఉద్యోగ నియామకాల లక్ష్యం నెరవేరలేదని పేర్కొన్నారు. చివరికి రాష్ట్రం కోసం పోరాడిన విద్యార్థులపై నే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా ఏళ్లుగా యూనివర్సిటీలు పార్ట్ టైమ్ ఫ్యాకల్టీతో నడుస్తున్నాయన్నారు. మిగులు నిధులు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పాలన అప్పులపాలు చేసిందని చెప్పారు. బెనిఫిట్స్ అందక 60 మంది విశ్రాంత ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లకు రూ. 20 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు.
కృష్ణా జలాల్లొ 299 టీఎంసీలకే కేసీఆర్ సంతకం పెట్టడం తొందరపాటే అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రాజెక్టులు-నీళ్లపై ఓ విధానం లేదని రామచందర్ రావు వెల్లడించారు. కృష్ణా జలాల్లో మనకు అన్యాయం జరిగేలా కర్నాటకు సహకరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు, నిధులు ఇస్తోందన్నారు. తెలంగాణకు కేంద్రం రూ. 13 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని బీజేపీ చీఫ్ వెల్లడించారు. ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో ఎందుకు అమలు చేయట్లేదు? అని ప్రశ్నించారు.
ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అవకాశమిచ్చారు. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని తెలంగాన ప్రజలు నిర్ణయానికి వచ్చారని రామచందర్ రావు పేర్కొన్నారు. స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయని సూచించారు. గత నెలలో నరేంద్ర మోదీ సభకు తాము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మరింతగా పోరాడుతాం, ప్రజల్లోకి వెళ్తామని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ ఉత్తర తెలంగాణలోనూ ఆదరణ కోల్పోయిందన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు దాదాపు మర్చిపోయారని జోస్యం చెప్పారు. అన్ని జిల్లాల్లో బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందని వెల్లడించారు.






