చైల్ సేఫ్టీ వీక్లో దత్తతపై అవగాహన
మొయినాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): మొయినాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో చైల్ సేఫ్టీ వీక్ కార్యక్రమంలో భాగంగా చట్టబద్ధ దత్తత ప్రక్రియ, అనధికార దత్తత వల్ల కలిగే ప్రమాదాలు, రక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో సంధ్యా, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, సబ్ ఇన్స్పెక్టర్ జబీనా బేగం, ఏసీడీపీవో హర్షవర్ధని పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పిల్లలను దత్తత తీసుకునే వారు తప్పనిసరిగా CARA నిబంధనలను పాటించాలని సూచించారు.
బంధువుల ద్వారా లేదా డబ్బులు చెల్లించి అనధికారంగా దత్తత తీసుకోవడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు.పిల్లలను కొనడం, అమ్మడం లేదా వారి ప్రయోజనాల కోసం ఉపయోగించడం వంటి చర్యలకు కఠినమైన కారాగార శిక్షలు ఉంటాయని తెలిపారు. దత్తత కోరుకునే వారు ప్రభుత్వ గుర్తింపు పొందిన శిశు గృహాల ద్వారా మాత్రమే దత్తత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది, కౌన్సిలర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ పాలన అధికారులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.






