ఏపీ విద్యార్థులకు డిజిటల్ స్కిల్స్ లో అండగా పియర్సన్
శ్రీకాకుళం, 14 జూలై 2026 :
ప్రపంచ ప్రఖ్యాత జీవితకాల అభ్యాస సంస్థ అయిన పియర్సన్, శ్రీకాకుళం జిల్లా యంత్రాంగంతో కలిసి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో రెండు స్టెమ్ నైపుణ్యాల ల్యాబ్లను ఏర్పాటు చేశాయి. వీటి ద్వారా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు సాంకేతికత ఆధారిత, ఆచరణాత్మక అభ్యాసానికి మరిన్ని అవకాశాలను విస్తరిస్తున్నాయి.
శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ పాఠశాల మరియు జెడ్పీహెచ్ఎస్ నిమ్మాడలో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ల ద్వారా 1,000 మందికి పైగా విద్యార్థులు ప్రయోజనం పొందగలరు. డిజిటల్ సాధనాలను ఉపయోగించి చేసే ప్రయోగాత్మక ప్రాజెక్టుల ద్వారా, విద్యార్థులు సాంప్రదాయ తరగతి గది అభ్యాసం మాత్రమే అందించలేని రీతిలో సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మరియు విమర్శనాత్మక ఆలోచనా విధానాన్ని మెరుగుపరచుకోగలరు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐఏఎస్ మాట్లాడుతూ శ్రీకాకుళం విషయానికి వస్తే, విద్యార్థులు అభ్యసించే విధానాన్ని మార్చడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం. ఈ ల్యాబ్లు ప్రభుత్వ పాఠశాలల్లోకి ప్రయోగాత్మక, సాంకేతికత ఆధారిత అభ్యాసాన్ని తీసుకువస్తాయి. పాఠశాల విద్య నుంచే నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలపై రాష్ట్రం దృష్టి సారించడాన్ని ఈ కార్యక్రమం బలపరుస్తుంది. ఇటువంటి భాగస్వామ్యాలు శ్రీకాకుళం వంటి జిల్లాల్లోని విద్యార్థులు ఆ ప్రయాణంలో భాగమయ్యేలా , ఆచరణాత్మకమైన, దీర్ఘకాలిక అవకాశాల ద్వారా ప్రయోజనం పొందేలా చూడటంలో సహాయపడతాయన్నారు .
పియర్సన్ ఇండియా కంట్రీ హెడ్ వినయ్ కుమార్ స్వామి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఆత్మవిశ్వాసం, జిజ్ఞాస, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే నైపుణ్యాలను పెంపొందించే అవకాశాలు అందుబాటులో ఉండాలి. ఈ స్టెమ్ స్కిల్స్ ల్యాబ్లు, విద్యార్థులు నూతన సాంకేతికతలతో ప్రయోగాలు చేయడం ద్వారా నేర్చుకోవడానికి, చిన్న వయస్సు నుండే సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడతాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి శ్రీకాకుళం జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేస్తున్నందుకు తాము గర్విస్తున్నామన్నారు.






