8 August, 2026 | 11:04 AM

అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత

08-08-2026 10:16 AM

జమ్ము: ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూ నుంచి అమర్‌నాథ్ యాత్రను(Amarnath Yatra Suspended) నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. శనివారం ఉదయం భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుండి కాశ్మీర్ లోయకు యాత్రికుల కొత్త బృందం ఏదీ బయలుదేరడానికి అనుమతించలేదని పేర్కొన్నారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, కాశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే ఏకైక రహదారి అయిన జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి పరిస్థితి, వాతావరణాన్ని బట్టి యాత్రికుల కదలికలపై సమీక్ష జరుపుతామని అధికారులు తెలిపారు.

జూలై 3న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుండి కాశ్మీర్ హిమాలయాల్లోని 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర గుహాలయాన్ని ఇప్పటివరకు 4.75 లక్షల మందికి పైగా యాత్రికులు సందర్శించారు. 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర, రక్షాబంధన్ పర్వదినం నాడైన ఆగస్టు 28న ముగియనుంది. స్థానిక వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరిక ప్రకారం, జమ్మూ ప్రాంతంలోని కొన్ని చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ఆగస్టు 11 వరకు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. శనివారం తెల్లవారుజామున తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసినప్పటికీ, జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు సజావుగా సాగాయని అధికారులు తెలిపారు.