బీజేపీ 'నారి'ని 'నారా'గా మార్చేసింది: అఖిలేష్ యాదవ్
- లింగ సమానత్వంలో భారత్ ఎక్కడ ఉందో గమనించాలి
- ఢిల్లీలో ఉన్న మహిళా ముఖ్యమంత్రి.. కేవలం సగం సీఎం మాత్రమే
- మహిళా రిజర్వేషన్ బిల్లుపై వాదోపవాదాలు
- మహిళా కోటా బిల్లుపై వాడివేడి చర్చ
- ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు
- కులగణనను ఆలస్యం చేయడానికే ఈ బిల్లు
- కోటాకు మద్దతు, నియోజకవర్గాల పునర్విభజనకు కాదు
- నియోజకవర్గాల పునర్విభజన బీజేపీకి ఒక రాజకీయ సాధనం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం(Central Government) లోక్ సభలో గురువారం నాడు మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై(Women's Reservation Bill) లోక్ సభలో వాడివేడి చర్చ జరిగింది. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ... సమాజ్ వాదీ పార్టీ ఎప్పుడూ మహిళల పక్షాన ఉంటుందని తెలిపారు. మహిళల అభివృద్ధికి సమాజ్ వాదీ పార్టీ కృషి చేసిందని పేర్కొన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు మద్దతిస్తున్నామని అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. ఎన్డీఏ హయాంలో మహిళలకు అనేక పథకాలు తెచ్చినట్లు చెప్పారు. లింగ సమానత్వంతో భారత్ ఎక్కడ ఉందో గమనించాలని అఖిలేష్ యాదవ్ కోరారు. లింగ సమానత్వంలో 146 స్థానాల్లో భారత్ 127వ స్థానంలో నిలిచిందన్నారు.
భారత దేశంలో 21 రాష్ట్రాలు, యూటీల్లో ఎన్డీఏ పాలన ఉందన్న అఖిలేష్ యాదవ్ ఎన్డీఏ పాలిస్తున్న రాష్ట్రాల్లో మహిళా సీఎంలు ఉన్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న మహిళా ముఖ్యమంత్రి.. కేవలం సగం సీఎం మాత్రమేనని అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. మహిళ అయినందున సగం సీఎం అయ్యారు.. అధికారాలు మాత్రం లేవని ఆరోపించారు. ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రి వద్ద ఎలాంటి అధికారాలు ఉన్నాయని ప్రశ్నించారు. అతిపెద్ద పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీ సంఖ్య ఎంత? అని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్రం చూపుతున్న తొందరపాటును సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. కుల ఆధారిత రిజర్వేషన్ల డిమాండ్లను నివారించేందుకే కేంద్రం జనగణనను తప్పించుకుంటోందని ఆయన ఆరోపించారు.






